తాడిగడప శ్యామలరావు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;తాడిగడప శ్యామలరావు

‘మధురానగరిలో’ రాసినది శ్రీ చిత్తూరు సుబ్రమణియ పిళ్ళై గారే నన్నది నా అభిప్రాయం కాదండీ. మీరన్నట్లు ఆంధ్రజ్యోతిలో వచ్చినంత మాత్రాన అది చిత్తూరు వారి రచన అనే అభిప్రాయం ప్రామాణికం అవదు కాని ఆంధ్రజ్యోతిలోని ఆ వ్యాసంలో ఆ మాట చెప్పినది సాక్షాత్తూ చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై గారి కుమార్తె రేవతీ రత్నస్వామి గారు. నిజానికి జ్యోతిలో వచ్చినది ఒక వ్యాసమో ఆవిడతో ముఖాముఖీయో నాకు ఇప్పుడు గుర్తులేదు. వచ్చి ఇరవైయేళ్ళదాకా అయ్యుండవచ్చును. ఆంధ్రజ్యోతివారి నుండి ఆ వ్యాసం సేకరించగలిగితే స్పష్టత వస్తుంది.


25 April 2025 9:28 AM

ఈమాట;తాడిగడప శ్యామలరావు

త్యాగరాజస్వామి వారు బాల్యంలోనే కృతి రచనకు శ్రీకారం చుట్టారు. బహు కాలమే జీవించిన స్వామి వారు వేల కృతులనే రచించి ఉండవచ్చును. ఆయన వాటిని స్వయంగా గ్రంథస్థం చేయకపోవటం కారణంగా కావచ్చు చాలావరకూ ఆయన కృతులు అలభ్యంగా ఉన్నాయి. మనకు లభ్యంగా లేని కృతులలో ఆనందభైరవి లో కూడా ఎన్నో ఉండవచ్చును. ఆనందభైరవి రాగాన్ని త్యాగరాజస్వామి వారు కూచిపూడి భాగవతులకు దానం ఇవ్వటం కాకమ్మ కధలా ఉంది. ఇది నాగయ్య గారి త్యాగయ్య సినీమాలో మధురానగరిలో పాటతో సహా ఉండి అపోహలను మరింత పెంచి పోషించినట్లు తోస్తూ ఉంది.


24 April 2025 10:16 PM

ఈమాట;తాడిగడప శ్యామలరావు

‘మధురానగరిలో’ రాసినది శ్రీ చిత్తూరు సుబ్రమణియ పిళ్ళై గారే నండీ. కొన్నేళ్ళ క్రిందట ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం వచ్చింది వీరిగురించి. అందులో మరొక విశేషం కూడా తెలిసింది. ఈ మధురానగరిలో పాటను కచేరీలలో విద్వాంసులు రకరకాల రాగాల్లో పాడుతుంటే చిత్తూరు వారి ఇది ఆనందభైరవిలోనే పాడవలసింది అని నిక్కచ్చిగా చెప్పారని. అవ్యాసంలోని విశేషాలను వారి కుమార్తె గారు అందించారని వ్రాసారు దానిలో.

వికీపీడియాలో వీరి గురించిన పేజీ ఉంది. దానిలో “ఆకాలంలో రికార్డింగు విధానం ప్రారంభ దశలో ఉండుటవలన, వీరు రచించిన మధురా నగరిలో చల్లలమ్మ బోను, కులములోన గొల్లదాన, మావల్లగాదమ్మ వంటి కొన్ని మాత్రము కొలంబియా సంస్థ ద్వారా రికార్డు చేయబడ్డాయి” అని రిఫరెన్సు ఇచ్చారు.


24 April 2025 9:47 PM

ఈమాట;తాడిగడప శ్యామలరావు

ప్రహ్లాద భక్తి విజయము లోని కందపద్యం ఈవ్యాసంలో కొన్ని తప్పులతో వచ్చింది.

కం: శ్రీ జానకీ మనోహర
రాజీవ భవాది సంధ్య రఘుకుల తిలకా
రాజీవ నయన మునిజన
పూజిత పద రామచంద్ర పుణ్యము చరితా

ఈపద్యం ఆంధ్రభారతి వారి సైటులో కూడా కొంత తప్పుగానే ఉంది. aarchive.org వారి సైటులో ఈపుస్తకం (ప్రచురణకు సంబంధించిన వివరాలు లేకుండా) లభిస్తోంది. అందులో ఉన్నపాఠమే ఆంధ్రభారతిలోనూ ఉంది.

శ్రీ జానకీ మనోహర
రాజీవ భవాది వంద్య రఘుకులతిలకా
రాజీవనయన మునిజన
పూజితపద రామచంద్ర పుణ్యచరితా

అని. ఈపాఠంలో చివరి మాటను పుణ్యచరిత్రా అని సవరించితే ఛందస్సుకు సరిగా ఉంటుంది. ఈమాట వారి వ్యాసంలో వంద్యకు బదులు సంధ్య అని అదనపు తప్పు దొర్లింది. అంతే కాక పుణ్యచరిత్రా బదులు పుణ్యము చరితా అని ఉండటం జరిగింది. ఈ రెండు తప్పుల వలనా ఛందోభంగం జరుగకపోవటం విశేషమే కాని సరిజేసు కొనక తప్పదు.

మరొక్క మాట. సంస్కృతసమాసాలను మధ్యలో స్పేసెస్ ఇచ్చి వ్రాయటం సంప్రదాయం కాదు. సమాసం అంటే సాంకేతికంగా అది ఒకే పదం కాబట్టి దానిలోని పదాలను విడివిడిగా వ్రాయకూడదు. కాని ఈమధ్య అలా వ్రాయటం తరచుగానే చూస్తున్నాం.
[ ఛందోదోషమును, సమాసపదచ్ఛేదదోషమును చూపినందుకు ధన్యవాదాలు. సరిచేసినాము. — సం. ]


24 April 2025 9:40 PM

ఈమాట;తాడిగడప శ్యామలరావు

తెలుగు భావింప నలవిగాని పెద్దభాష అని బాగా చెప్పారు.

ఆంధ్రత్వమాంధ్రభాషాచ నాల్పస్య తపసః ఫలం అని అన్నారు తమిళులైన అప్పయ దీక్షితులు అన్నారని విన్నాను.


08 April 2025 1:20 PM

ఈమాట;తాడిగడప శ్యామలరావు

వాగ్వల్లభ దుఃఖభంజనము పుస్తకం లింక్ ఇచ్చినందుకు VSTSayee గారికి ధన్యవాదాలు. సిధ్ధాన్నాన్నిభుజించలేని వాడిలా చింతిస్తున్నాను నాగరిలిపి చదువలేనే అని. తెలుగు లిపిలో దొరికితే మహదానందం. పోనీ యుండి ప్రాప్తించిన లేశమైన పదివేలు అనుకో మన్నాడు పోతున్న.


03 April 2025 12:15 PM

ఈమాట;తాడిగడప శ్యామలరావు

వాగ్వల్లభ దుఃఖభంజనము పుస్తకం కోసం నేను ఇంటర్నెట్ గాలించి లాభం లేకపోయింది.

వ్యాసకర్త గారు కాని మరెవరైనా కాని ఈవిషయంలో ఏమైనా సహాయం చేయగలరా?


02 April 2025 6:31 PM

సరసభారతి ఉయ్యూరు పై వ్యాఖ్యలు;తాడిగడప శ్యామలరావు

> జాతీయ కవి సార్వభౌమ, మా కొద్దీ తెల్ల దొరతనం గేయ కవి. శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారి…..

దురదృష్టవశాత్తూ ఆయన తెలుగువాడైపోయాడు. అయన జాతీయ కవి సార్వభౌమ, మా కొద్దీ తెల్ల దొరతనం గేయ కవి అని మనం చెప్పుకుంటున్నా ఆ జాతీయకవి గురించి భరతజాతిలో తెలుగువాళ్ళలో (అతికొద్దిమందిని) మినహాయించితే జాతీయస్థాయిలో ఎవ్వరికీ తెలియదు కదా!

ఈ తెలుగువాళ్ళు ఎంత బడుధ్ధాయిలూ అంటే చెదురుమదురుగా కొద్దిమంది (పెద్దలు) తప్ప నేటి తెలుగువాళ్ళెవరికీ ఈయన గురించి తెలియనే తెలియదు! ముందుముందు తెలిసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే తెలుగుపిల్లలు తెలుగులో మాట్లాడటం మానేసి చాలా కాలమే ఐనది. ఈతరాల్లో పిల్లలకి ఇంగ్లీషు ముఖ్యం అని ప్రభుత్వాలే తెలుగు నేర్పటమూ లేదు, తెలుగువాళ్ళ గురించి చెప్పటమూ లేదు పాఠాల్లో. పాఠాల్లో ఎంతసేపూ జాతీయత వెల్లివిరిసేలా ఉత్తరాహుల గురించి మాత్రమే ఉంటుంది.

Like


10 September 2023 7:28 PM

PHANI BABU -musings;తాడిగడప శ్యామలరావు

In reply to .

అవకాశం రానంతవరకూ అందరూ మంచివాళ్ళలాగే కనిపిస్తారన్న నానుడి ఉన్నమాట నిజమే. ఒక వ్యక్తి చెడ్డవాడిగా తేలాలి అంటే, మొదట అతనికి ఇతరులకు చెడు చేసేందుకు అవకాశం రావాలి, రెండవది ఆవిధంగా మీదకు వస్తున్న చెడును ఆవలి వారు గుర్తించ గలగాలి. అవకాశం కోసం ఎదురుచూస్తున్న వాడి సంగతి ఇతరులకు తెలిసే అవకాశం తక్కువగానే ఉంటుంది. కాబట్టి చెడుని చెడ్డవాడు క్రియారూపంలోనికి తెచ్చేందుకు యత్నించి దొరికిపోయే వరకు సమాజందృష్టిలో మంచివాడే కద. సమర్ధుడైన చెడ్డవాడు దొరికిపోకుండా చెడుచేస్తూ మంచివాడిగానే చెలామణీ అవుతూ ఉంటాడు. అందుకే దొరికేతేనే దొంగ అన్న నానుడీ వచ్చింది. మంచివాడు మంచివాడిలాగా ఉండటానికి ఇబ్బంది పడడు. కాని చెడ్డవాడు మంచివాడిలా నటించటానికి నానాతంటాలూ‌ పడుతూ ఉండాలి. మంచివారిలో సహజంగా ఉండే‌ బలహీనత చుట్టూ ఉన్నవాళ్ళంతా మంచివాళ్ళే అనుకోవటం – తద్వారా చెడ్దవాళ్ళకి ద్వారాలు తెరవటం. చెడ్డవాడి బలం చుట్టూ ఉన్నవాళ్ళల్లో ఎందరో చెడ్డవాళ్ళు ఉన్నారని నమ్మటం – తద్వారా దొరక్కుండా జాగ్రత వహించటం. ఈ జాగ్రత కారణంగా చెడ్డవాళ్ళు దొరక్కుండా ఎక్కువకాలం‌ నెట్టుకొని రాగలుగుతారు. కాని నటన ఎన్నడూ సహజం‌ కాదు కాబట్టి జాగ్రతగా గమనించగలిగితే చెడ్డవాళ్ళు తప్పక తమ నటనలో దొరికితీరుతారు. కేవలం మేథావులు మాత్రం చెడ్డవాళ్ళ నటనలో చిన్నచిన్న తప్పులనూ గమనించటం ద్వారా వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవటమూ వాళ్ళని పట్టుకోవటమే చేయగలరు. అందుకే సరైన అవకాశమూ, సరైన సమయ సందర్భాలూ కుదిరితే కాని చెడ్డవాడు చెడు అమలు చేయక, చేయలేక మంచి నటిస్తూ నెట్టుకొస్తూనే ఉంటాడు.

Like


14 January 2023 9:34 PM

PHANI BABU -musings;తాడిగడప శ్యామలరావు

In reply to .

మంచి ప్రశ్నవేసారు. స్వభావమే కారణం అని నా ఉద్దేశం. మంచివాళ్ళవటానికీ తదన్యంగా ఉండటానికీ కూడా. శ్రీమద్రామాయణంలో,కైకకు చెడ్డమాటలు నూరిపోసి, రాముడి పట్టాభిషేకాన్ని అడ్డుకుంటుంది మంధర. అక్కడ ఆల్మీకి మహర్షికి ఇటువంటి ప్రశ్నయే వచ్చింది. ఎందుకని రాముడి పట్టాభిషేకాన్ని మంధర అడ్డుకోవాలని చూచిందీ? పాఠకులకు ఏమని వివరించాలీ కారణం అని. అయన క్లుప్తంగా ఇలా అన్నారు “మంధరా పాపదర్శినీ” అని. ఆమె బుధ్ధి పాపాన్నే చూస్తుంది అఒని. కాబట్టి ఆమె పాపకార్యాలే చేస్తుంది అని మనకు అర్ధం అవుతున్నది కదా. ఎందుకని మంధర పాపదర్శిని అని అడగలేము. అడిగితే జవాబు ఏమిటీ? అమె స్వభావం అది అని చెప్పాలంతే. ఎందుకంటే స్వభావో దురతిక్రమణీయః అని మనకు తెలుసు. పుట్టుకతో వచ్చిన స్వభావం మారదు. మానవులు అభ్యాసం చేసి సంస్కారాన్ని అలవరచుకొని మార్చుకోవాలి దాన్ని – కొన్ని జన్మలు పట్టవచ్చును. మంచి వాళ్ళైనా చెడ్దవాళ్ళైనా సరే వారి స్వభావం కారణంగానే మంచి చెడు ప్రవర్తనలు చూపుతారు. చిన్నతనంలో చెడు ప్రవర్తన ఎలా చూపుతారూ అంటే మనవాళ్ళు పూర్వజన్మ సంస్కారం అంటారు. రెండుమూడేళ్ళకే‌ సంగీతప్రతిభ చూపి రాగాలనే గుర్తుపట్టే పిల్లలుంటారు. అన్నప్రాశన నాడే ఏదో ఆంటీ‌ ఉంగరం కొట్టేసే పిల్లలూ ఉంటారు. అదంతే నన్నమాట. దుర్యోధనుడు కృష్ణూదితో అన్నాడట. జానాని ధర్మం న చ మే ప్ర్రవృత్తి, జానామ్యధర్మం న చ మే నివృత్తి అని. ఒకరికి తెలియటంతో‌ సరిపోదండి. స్వభావం వారిని సరిగా ప్రవర్తించనీయాలి కదా. అందుచేత స్వభావం కారణంగ కొందరు లోకంలో మంచివారుగా ఉంటున్నారు. స్వభవం కారణంగా కొందరు లోకంలో చెడ్డవారుగా ఉంటున్నారు. అందరూ ఉత్తమసంస్కారం దిశగానే‌ ప్రయాణం చేస్తున్నారు. కాని అందరూ వివిధదశల్లో ఉండటం చేత మంచివారూ చెడ్డవారూ ఎప్పుడూ లోకంలో ఉంటున్నారు.

Liked by


10 January 2023 9:20 PM