పద్మావతి వడ్లవల్లి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
హనుమంతరావు గారు ముఖాముఖి నాకు పరిచయం లేకపోయినా మా వారి మాటల ద్వారా, రవీంద్ర మాటల ద్వారా నాకు తెలుసు. హనుమంతరావు గారు కష్టపడే వ్యక్తిత్వం కలవారని, కష్టపడి ఉన్నత స్థాయిలో ఉన్నారని, 40 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నారని, సొంత గ్రామంలో గ్రంథాలయం స్థాపించారని మాత్రమే నాకు తెలుసు.
కానీ తనకి ఇప్పుడా తెలుగు భాష అన్నా, తెలుగు గ్రంథాలన్నా, తెలుగు సాహిత్యం అన్నా మక్కువ అని తెలుసుకున్నాను. మహిమాలయం చదువుతూ తన చిన్న వయసు నుంచి చదివిన పుస్తకాలను మననం చేసుకుంటూ ఇప్పుడు మహిమాలయానికి మంచి వివరణ ఇచ్చారు. వివరణ చెప్పే ముందు హనుమంతరావు గారి ద్వారా చాలా పుస్తకముల పేర్లు, కవుల పేర్లు నేను కూడా కొత్తగా తెలుసుకున్నాను. ఎలిజబెత్ బిషప్ అనే కవయిత్రి గురించి, సంజీవ్ దేవ్ గారి గురించి, బ్రిటన్కు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ హెన్రీ మార్ష్ గురించి, నాయని సుబ్బారావు గారి గురించి… చాలా మంది కవుల పేర్లు తెలుసుకున్నాను.
మహిమాలయం గురించి హనుమంతరావు గారి వివరణ… అటజని కాంచె కృషీవలుడు అన్నారు. కృషీవలుడు ఇక్కడ వర్ణన చాలా బాగుందనిపించింది. ఎలిజబెత్ బిషప్ హిమాలయాల ప్రశ్నల వర్షాన్ని తను మననం చేసుకుంటూ మనందరికీ మరొకసారి తెలియజేశారు. ఇది కూడా బాగుంది. త్రిభువన్ చూసినప్పుడు మీకు గుర్తుకు వచ్చిన మీరు రాసిన కవితను రాస్తూ అందులో మిమ్మల్ని కూడా చేర్చారు. భావకవుల ప్రేయసి ఊహలలో అని, అభిమన్యు ప్రణయగీతి శశిరేఖ అని, నాయని సుబ్బారావుకు తన మేనమామ కూతురే తన భార్య అని, రవీంద్రుడికి ప్రేరణ సరోజిని అని, ఇక్కడ ప్రేరణ అంటే ప్రేయసి అని చాలా బాగా రాశారు.
మిగతా పుస్తకాలతో పోలిస్తే మీది రెండు గుణాలలో విలక్షణంగా ఉందన్నారు. ప్రతి అధ్యాయంలోనూ తనది కానీ తను చదివినది కానీ కవితా రూపంలో రాయడం ఒకటైతే, రెండవది అక్కడి జనుల జీవనరీతిని తన బాల్యపు అనుభవాలకు అన్వయించుకుంటూ రాశారు. ఇలాంటి ప్రత్యేకత కలిగిన విషయాలను తన వివరణలో చాలా బాగా వివరించారు. జన్మభూమి జ్ఞాపకాల పరంపర. నాయని సుబ్బారావు గారికి జన్మభూమి మీద ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ మీకు కూడా ఉందని ఉదాహరణలతో చెప్పారు.
తెగిన జ్ఞాపకాలు. హనుమంతరావు గారు యుక్త వయసులో చదివిన సంజీవ్ దేవ్ రాసిన తెగిన జ్ఞాపకాలు అనే పుస్తకం మననకు రావడం, గుండెలలో గూడు కట్టుకున్న విషాదం, దేశాటనకై నాలో చెలరేగిన ఆరాటం అన్న అధ్యాయంలో మానసంలోని తమస్సును తొలగించుకోవడానికి హిమాలయాలకు వెళ్ళడానికి సంజీవ్ దేవ్ నిర్ణయించుకున్నారని, అతను హిమాలయాలకు 16 ఏళ్ళ వయసులో వెళ్లి రాసిన అతని భావోద్వేగం మరలా రవీంద్రలో కనిపించిందని రాశారు. ఇక్కడ కూడా వివరణ చాలా బాగుంది.
శస్త్రకారుని సూక్ష్మ పరిశీలన. బ్రిటన్కు చెందిన ప్రఖ్యాతి గాంచిన న్యూరో సర్జన్ హెన్రీ మార్ష్ తన 65వ ఏట ఉద్యోగానికి రాజీనామా చేసి తన మిత్రుడు దేవ్తో కలిసి నేపాల్లో పని చేస్తూ హిమాలయాలకు వెళ్ళడం, హిమాలయాలను చూసి వాటి అందాలు, అక్కడ ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు, జీవన విధానం ఎలా వివరించారో మీరు కూడా చాలా బాగా వివరించి రాశారని వివరణ ఇచ్చారు. వివరణ విభాగలుగా చాలా బాగా ఇచ్చారు.
ఇక విమర్శ గురించి చెప్పాలంటే హనుమంతరావు గారు వినయంతో కూడిన విమర్శ ఇచ్చారు. మొదటిది కవిత్వం పై ఉన్న మోహం వచనం మీద లేదని అన్నారు. కానీ నాకనిపించింది వచనం రాయడం కన్నా కవిత్వం రాయడం చాలా కష్టం కదా అని. రెండోది కళ్ళ ముందు ఉన్నది వర్ణించబోయి అంతలోనే జ్ఞాపకాల దొంతర్లోకి వెళ్లడం అని రాశారు. అది కవులకు సహజ లక్షణమే కదా అని నాకనిపించింది. మీ గత స్మృతులు వర్తమానాన్ని ముంచివేయకూడదని, వర్తమానంలో మీరు సాధించవలసింది చాలా ఉందని మరొక్కసారి మీ ఆప్త మిత్రునిగా మీకు తన సూచన తెలియజేశారు.
అభినందన. అందరి అభినందనలు చాలా బాగున్నాయని పేరుపేరునా రాశారు. నేను కూడా చివర్లో ఒక మాట చెప్పాలనుకున్నాను. రవీంద్రుడు రాహులుడైన వేళ అని సాంకృత్యాయన్తో పోల్చారు సరస్వతీ పుత్రులైన కళారత్న భూసురపల్లి వెంకటేశ్వర్లు గారు. పుస్తకం నా చేతికి వచ్చిన తర్వాత మొదట అందరి అభినందనలు చదివాను. అందరూ చాలా బాగా రాశారు కదా అనుకున్నాను. నాకు మొదట భూసరపల్లి గారు రాసిన రవీంద్రుడు రాహులుడైన వేళ అనేది అర్థం కాలేదు. తర్వాత పరిశీలించాను. పరిశీలిస్తే రాహుల్ సాంకృత్యాయన్ చాలా పెద్ద కవి అని, అతని గురించి తెలుసుకోవాలంటే నా జీవితం సరిపోదని తెలుసుకున్నాను. అంత పెద్ద కవితో మిమ్మల్ని పోల్చారు. ఇది చాలా గొప్ప విషయం. కాలం ఉన్నంత కాలం నిలిచిపోయే కవిగా మహిమాలయాన్ని రాసి అందించినందుకు మీకు మరొక్కసారి నా అభినందనలు తెలుపుతున్నాను.
— వడ్లవల్లి పద్మావతి, హైదరాబాదు.