వసుంధర తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
తెలుగు కథకు ఈ తరహా విశ్లేషణ అపూర్వం. ఇది అందించడానికి తగిన పరిజ్ణానం, పరిణతి, సామర్థ్యం ఉన్న మెడికో శ్యాం- అందుకు పూనుకోవడం తెలుగు సాహితి అదృష్టం. సాహితీప్రియులందరూ చదివి తీరాల్సిన ఈ ప్రసంగవ్యాసం- వెనుకనున్న కృషి, తపన అభివందనీయం అంటే అది చాలా చిన్నమాట!
తెలుగు సాహితికి అద్భుతమైన ‘షామియానా’ సమకూర్చిన మెడికో శ్యాం లో మరో విశేషం- తన మనోభావాల్ని సూటిగా నిష్కర్షగా నిజాయితీగా చెప్పడం! అందువల్ల వారి పొగడ్తలకూ, విమర్శలకూ విలువ పెరుగుతుంది. ఎన్నో దశాబ్దాల క్రితం జ్ణాపకాల్లోంచి వ్రాస్తున్నందువల్ల ఎక్కడైనా తప్పులు దొర్ల వచ్చునన్న అనుమానాన్ని వెలిబుచ్చారు వారు. ఆ మేరకు మా (వసుంధర) రచనలకు సంబంధించిన రెండు సవరణలను ఇక్కడ ఇస్తున్నాము. 1. ”పెసరపప్పు’ మా మొదటి కథ కాదు. మొదటిది ఆంధ్రపత్రికలో వచ్చిన ‘స్టంటు సినిమా కథ’. స్వాతి మాసపత్రిక తాజా సంచిక (మే 2024) లో కెవిఎస్ వర్మ అనే రచయిత ఇటీవలే దీన్ని పరిచయం చేశారు. 2. ముళ్లపూడి వెంకటరమణ గారు ఎస్టీడీ ఖరీదైన రోజుల్లో మద్రాసునుంచి అరగంటకు పైగా మమ్మల్ని మెచ్చుకుంటూ చేసిన ఫోను- ”పెళ్లయ్యాక చూడు’ నవల గురించి కాదు. ”పెళ్లి చేసి చూడు’ నవల గురించి. మధ్యతరగతి కుటుంబంలో ఓ ఆడపిల్ల పెళ్లి కథ అది. ”పెళ్లయ్యాక చూడు’- దాంపత్య జీవితంలో దంపతులకు తొలి సంతానం ముచ్చట్లు. మెడికో శ్యాం గారు చదివింది ఇది. ఒక విధంగా ఇది మాకు సంతోషమే. రెండు నవలలకూ మహామహుల ప్రశంస లభించినట్లు కదా!
‘షామియానా’లో మెడికో శ్యాం విశ్వరూపాన్ని దర్శించినవారిగా- వారి ప్రసంగవ్యాసంలో మా రచనల ప్రసక్తి రావడం మాకు గౌరవంగా భావిస్తున్నాం.
ఈ ప్రసంగవ్యాసాన్ని- సాహితీలోకానికి అందించిన శ్రీ మెడికో శ్యాం గారికి కృతజ్ణతలు; ప్రచురించిన ‘ఈ మాట’కు అభినందనలు; మాకు చేర్చిన శ్రీమతి శ్యామల గారికి ధన్యవాదాలు.
వసుంధర, హైదరాబాద్